రికార్డు ప్రాఫిట్స్‌, షేర్‌హోల్డర్స్‌కు పండుగ | Sakshi
Sakshi News home page

రికార్డు ప్రాఫిట్స్‌, షేర్‌హోల్డర్స్‌కు పండుగ

Published Tue, Oct 31 2017 10:38 AM

Samsung Electronics to boost returns after record Q3 profit 

సియోల్‌ : దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ రికార్డు త్రైమాసిక లాభాలను నమోదుచేసింది. తన మెమరీ చిప్‌లకు గ్లోబల్‌గా ఏర్పడ్డ బలమైన డిమాండ్‌తో, ఈ ఏడాది రెండో సారి శాంసంగ్‌ లాభాల్లో దంచికొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్‌లో కంపెనీ లాభాలు 11.19 ట్రిలియన్ ఓన్‌లకు పెరిగాయి. రెవెన్యూలు కూడా 30 శాతం పెరిగి 62.05 ట్రిలియన్‌ ఓన్‌లగా నమోదయ్యాయి. ఈ రికార్డు లాభాల అనంతరం శాంసంగ్‌ 26 బిలియన్‌ డాలర్లను వాటాదారులకు తిరిగి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని వాటాదారులకు పంచనుంది. దీంతో శాంసంగ్‌ వాటాదారుల పండుగ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది వరకు డెవిడెండ్‌లను రెండింతలు చేసి, 9.6 ట్రిలియన్‌ ఓన్‌లను చెల్లించనున్నట్టు శాంసంగ్‌ పేర్కొంది. 

కంపెనీ వద్దనున్న నగదు, నగదుతో సమానమైనవి సెప్టెంబర్‌ ముగింపుకు 76 ట్రిలయన్‌ ఓన్‌లకు పెరిగాయి. ఇవి ముందు క్వార్టర్‌తో పోలిస్తే 8 శాతం ఎక్కువ. అంతేకాక 2017లో భారీగా మూలధన వ్యయాలు ఎన్నడు లేనంత పెరిగినట్టు కూడా కంపెనీ చెప్పింది. కొత్త చిప్‌ ఫ్యాక్టరీల అభివృద్ధి కారణంతో ఈ వ్యయాలు 81 శాతం ఎగిసి 46.2 ట్రిలియన్‌ ఓన్‌లుగా నమోదైనట్టు వివరించింది. అయితే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజ కంపెనీగా ఉన్న దీనికి, మొబైల్‌ డివిజన్‌ నుంచి వచ్చిన ఆపరేటింగ్‌ లాభాలు 19 శాతం కిందకి పడిపోయాయి. ఈ ఏడాది విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌8, నోట్‌8లు ముందస్తు వాటి కంటే మంచిగానే అమ్మకాలు నమోదుచేసినప్పటికీ, మొత్తంగా వీటి లాభాలు పడిపోయినట్టు తెలిసింది. కంపెనీకి ఎక్కువగా లాభాలు ఇంటర్నెట్‌-కనెక్టెడ్‌ డివైజ్‌లు, సర్వర్ల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.

Advertisement
Advertisement